గాంధీ ఆస్పత్రిలో అక్బరుద్దీన్‌కు వైద్య పరీక్షలు
విచారణకు ఫిట్ అని తేలితే అరెస్ట్ చేసే అవకాశం
అక్బరుద్దీన్ శరీరంలో తూటా ఉందన్న డాక్టర్లు
ఎం.ఆర్.ఐ వీలుకాదని తేల్చిన గాంధీ ఆస్పత్రి
హైదరాబాద్ - నిర్మల్ మార్గంలో భారీ భద్రత

హైదరాబాద్,  : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమర్జెన్సీ విభాగంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందం ఆయనకు వైద్య పరీక్షలు చేపట్టారు. అక్బరుద్దీన్ రాక సందర్భంగా పోలీసులు గాంధీ ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వైద్యుల నివేదిక ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.అక్బరుద్దీన్ శరీరంలో ఒక తూటా ఉందని, అందువల్ల ఆయనకు ఎం.ఆర్.ఐ పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని డాక్టర్లు తెలియజేశారు.

విచారణకు అక్బర్ 'ఫిట్' గా ఉన్నట్లు తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ చేస్తే ఆస్పత్రి నుంచి నిర్మల్ కు తరలిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - నిర్మల్ మార్గమధ్యలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివిధ కేసుల్లో చిక్కుకున్న అక్బరుద్దీన్ నిన్న(సోమవారం) నిర్మల్ పోలీసుల ముందు హాజరుకాలేదు. దీంతో గత రాత్రి ప్రభుత్వ వైద్య నిపుణులతో అక్కడి పోలీసులు అక్బరుద్దీన్ ఇంటికి చేరుకుని పరీక్షలు నిర్వహించారు.

తిరిగి ఈ ఉదయం మరోసారి అక్బరుద్దీన్ నివాసానికి వచ్చిన పోలీసులు విచారణకు సహకరించాల్సిందిగా కోరి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి