హిమాచల్‌లో మైనస్ 10.4 డిగ్రీలు
మౌంట్ అబూలో రెండోరోజు 0 డిగ్రీలు
ఉత్తర భారతంలో పడిపోతున్న ఉష్ణోగ్రత
23 మందిని బలిగొన్న చలిగాలులు

న్యూఢిల్లీ, జనవరి 7: ఉత్తరభారతం చలి గుప్పిట్లో విలవిల్లాడుతోంది. మరో 23 మంది చలిగాలుల బారిన పడి మరణించారు. ఢిల్లీలో 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో 15 మంది తీవ్రమైన చలితో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సీజన్‌లో మరణించిన వారి సంఖ్య 155కు చేరింది. ముజఫర్‌నగర్‌లో అత్యల్పంగా 0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వారణాసి, అలహాబాద్ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కొంతమేర పెరిగాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లోని పలుప్రాంతాల్లో ఘనీభవన స్థాయికన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటోం ది. లాహౌల్‌లోని కీలాంగ్, స్పిటి జిల్లాల్లో అత్యల్పంగా మైనస్ 10.4 డిగ్రీలు ఉండగా, కల్పాలో మైనస్ 5 డిగ్రీలు నమోదైంది. పంజాబ్, హర్యానాలలో చలికి ఆరుగురు మరణించారు. చండీగఢ్‌లో 3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానాలోని భివానీలో అత్యల్పంగా 1.6 డిగ్రీలు, అంబాలాలో 3.5 డిగ్రీలు, లూథియానాలో 4.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంది. రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో చలితో రెండు నిండు ప్రాణాలు పోయాయి.

చురులో మైనస్ 2.2 డిగ్రీలకు పడిపోయింది. పర్వతప్రాంతమైన మౌంట్ అబూలో వరుసగా రెండోరోజు కూడా సున్నా డిగ్రీలు, పిలానీలో 0.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. శ్రీనగర్‌లో మైనస్ 4.6 డిగ్రీల వద్దే కొనసాగుతోంది. గుల్‌మార్గ్‌లో మైనస్ 9 డిగ్రీలు ఉంది. పహల్గావ్ వద్ద మైనస్ 8 డిగ్రీలు నమోదైంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి